అత్యవసరం అయితేనే ఇళ్ళ నుండి బయటకు రావాలి,ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి,క్షేత్రస్థాయి లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు.అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి.
. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలి రానున్న 72 గంటలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్ష సూచన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి డాక్టర్: బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అతి భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన సహాయక చర్యలు, అప్రమత్తతతో కూడిన సన్నద్ధతపై ఆయా శాఖల వారీగా దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వీ.సీ ముగిసిన అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు-భవనాల శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు రాబోయే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే సమాచారం అందించాలన్నారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ కు, ఆయా శాఖల కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు సమాచారం అందించవచ్చని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రజలు కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. రానున్న 72 గంటల పాటు అవసరం ఉంటేనే ఇళ్ళ నుండి బయటకు రావాలని సూచించారు. పరిస్థితులను బట్టి పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సెలవులపై తగు నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని, చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని హితవు పలికారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం వంటివి చోటుచేసుకున్న సందర్భాలలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్ ను ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు తెగిపోవడం వంటివి జరిగితే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని, జనజీవనం స్తంభించిపోకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దారిమళ్ళింపు చర్యలలో పోలీసు అధికారులు, సిబ్బంది క్రియాశీలంగా పాల్గొనాలని సూచించారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తిస్తూ, అవసరమైన సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆహారం, ఇతర సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాలతో వరద జలాలు ఏర్పడి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పీ.హెచ్.సీలు, ఆసుపత్రులలో సరిపడా మందుల స్టాక్ ను అందుబాటులో పెట్టుకుని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్: రాజశ్రీని ఆదేశించారు. కాగా, భారీ వర్ష సూచన నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తమై ఉన్నదని, ఎలాంటి పరిస్థితులు తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి భరోసా కల్పించారు. వీడియో కాన్ఫరెన్సులో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.











