నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక:-27
పెండింగ్ కమీషన్ బకాయిలు ఐకెపి సంఘాలకు చెల్లించేలా చర్యలు
కుట్టు కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి
నవంబర్ వరకు జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి
సెర్ప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన పంచాయతీరాజ్ కార్యదర్శి
సెర్ప్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ప్ కార్యక్రమాల అమలు తీరుపై సీఈఓ డి. దివ్య దేవరాజన్ తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ప్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33 శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు.
జిల్లాలలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు నిర్వహణ జరపని పక్షంలో, ఆ కేంద్రాలను ఐకేపి మహిళా సంఘాలకు బదిలీ చేయాలని, అదనపు వరి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుని, వాటిని స్వశక్తి మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమీషన్ మహిళా సంఘాలకు అందడం లేదని, దీనిపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమీషన్ చెల్లింపులు జరిగేలా చూడాలని, గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలచే రైస్ మిల్లుల ఏర్పాటు ప్రణాళికలు తయారు చేయాలని, పౌర సరఫరాల శాఖ, సెర్ప్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు.
దివ్యాంగులకు యూ.డి.ఐ.డి. కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు.
నిర్ధారణ క్యాంపుల నిర్వహణ కోసం ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు అవసరమైన నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్దులు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని తెలిపారు. డిఆర్డిఓ, ఎంపిడిఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ లకు సూచించారు.
మూడు నెలలు ఫించన్ తీసుకోని లబ్దిదారులు వలస వెళ్లినట్లు సిస్టమ్ నమోదు చేస్తుందని అన్నారు. వలస వెళ్లినట్లు నమోదు అయిన వివరాలను అధికారులు పరిశీలన చేసుకొని పెన్షన్ తీసుకోక పోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని, లబ్ధిదారులు మరణిస్తే వివరాలను అప్ డేట్ చేయాలని అన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్వశక్తి మహిళా సంఘాలతో ట్యాగింగ్ చేసి, స్కూల్ యూనిఫాం కుట్టు ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలని అన్నారు. స్కూల్ యూనిఫాం కుట్టు పనులకు సంబంధించి అవసరమైన కటింగ్ మిషన్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని, మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, జూన్ నెల వరకు ఈ పనులు పూర్తి కావాలని అన్నారు. స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు సంబంధించి కూలీ చార్జెస్ 50 రూపాయలు మాత్రమే వచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారని, దీనిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండింగ్ చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించేలా చూడాలని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి బిల్లు చెల్లింపు పూర్తవుతుందని అన్నారు.
స్వశక్తి మహిళ సంఘాల ద్వారా నెలకొల్పబడిన స్టిచ్చింగ్ సెంటర్ లు పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫామ్ కుట్టిన తర్వాత ప్రైవేట్ గా కూడా కుట్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల స్థాయిలలో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందని ఆయన అధికారులకు తెలిపారు.
మహిళలచే చేపట్టే పెట్రోల్ బంక్ లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న హోటల్ వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని అన్నారు. మహిళా శక్తి మాల్స్ ఏర్పాటుకు కూడా అవకాశాలు కల్పించాలని అన్నారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి బజార్ కింద షాప్స్ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని అన్నారు. జిల్లాలలో వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంక్ లను మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, మరణించిన మహిళా సంఘాల సభ్యుల సరైన డాక్యుమెంట్ లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సహాయం అందేలా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి జిల్లాలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు మరణించారు, వారిలో ఎంత మందికి ప్రమాద బీమా, సాధారణ బీమా అమలు అవుతుంది పరిశీలించి సంబంధిత లబ్ధిదారులకు సహాయం అందజేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయాగౌడ్, ఎల్డీఎం అశోక్ చౌహాన్, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, మెప్మా పిడి రాజేందర్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.