ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం వన్ టైం సెటిల్మెంట్. ఒకే విడతలో చెల్లిస్తే 90 శాతం బకాయి వడ్డీ మాఫీ వర్తింపు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (తెలంగాణ పత్రిక) మార్చ్:-26
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి.
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ను అమలు చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే వన్ టైం సెటిల్మెంట్ ను ప్రభుత్వం అమలు చేయగా, ప్రజల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తరాలు జారీ చేసిందని అన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఏక కాలంలో, ఒకే విడత కింద చెల్లిస్తే 90శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆస్తి పన్ను బకాయి పడిన వారు ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించి వడ్డీ రాయితీ వడ్డీ రాయితీ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ది పొందాలని హితవు పలికారు. గడువులోపు వన్ టైం సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికే ఈ అవకాశం వర్తిస్తుందని అన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ప్రజలను కోరారు. కాగా, వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలులోకి రాకముందే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మార్చి 2025 వరకు వడ్డీ, జరిమానాలతో కలిపి మొత్తం ఆస్తి పన్ను బకాయిలను చెల్లించిన పన్ను చెల్లింపుదారులకు, వారి భవిష్యత్తులలో రాయితీని సర్దుబాటు చేస్తారని కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!