షాబాద్, 11 July
రంగారెడ్డి జిల్లా శాబాద్ పరిధిలో పోక్సో కేసు ప్రతీకారంతో ఒకే రాత్రి ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు రాజ్కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు, తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా శాబాద్ పరిధిలో ఒకే రాత్రి జరిగిన దారుణ ఘటనలో ఆరుగురు హత్యకు గురయ్యారు. పోక్సో కేసులో బెయిల్పై బయటకొచ్చిన నిందితుడు పగతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల్లో నిందితుడి భార్య, ఇద్దరు చిన్న కుమారులతో పాటు, తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మ ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 35 ఏళ్ల రాజ్కుమార్ అనే వ్యక్తి మొదట తన భార్య పార్వతి సరిత మరియు వారి ఇద్దరు చిన్న కుమారులపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి మరో గ్రామానికి వెళ్లి, తనపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మ పై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.
మొదటి ఘటన శాబాద్లో చోటుచేసుకోగా, ఆ తర్వాత నిందితుడు దేవలగూడ గ్రామానికి వెళ్లి దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు చోట్ల జరిగిన ఘటనల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలాల నుంచి హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఏడాది మే నెలలో 17 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజ్ కుమార్ పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసు నమోదైంది. ఆ కేసులో అతను వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ పొందాడు. ప్రాథమిక విచారణలో ఈ హత్యలు ఆ కేసుకు సంబంధించిన ప్రతీకార చర్య కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.










