ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప విత్తనాన్ని సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలంలో గల జలాల్ పూర్ గ్రామంలోని పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత చేప పిల్లలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. గతంలో మత్స్యకారులకు చేప పిల్లను కొని చెరువులో విడుదల చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో దళారులు పెట్టుబడులు పెట్టి చెరువులపై పెత్తనం చెలాయించేవారని తెలిపారు. మత్స్యకారుల శ్రమను దోపిడీ చేసేవారన్నారు. శ్రమ మత్స్యకారులది లాభం దళారులదిగా ఉండేదని పేర్కొన్నారు. దళారులకు చేపలను అమ్మవద్దని, మత్స్యకారులు స్వయంగా గ్రామాలు, పట్టణాలలో తిరిగి అమ్ముకో వడానికి ప్రయత్నం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయ స్వామి, ఫిషరీస్ మాజీ అడిషనల్ డైరెక్టర్ శంకర్ నాయక్ రాథోడ్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా పాల్గొన్నారు.
100 శాతం సబ్సిడీతో చేప విత్తనాల సరఫరా–ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
Published On: November 21, 2025 10:20 pm











