ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19:శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వీయుజ కృష్ణ ఏకాదశి నుండి త్రయోదశి వరకు (17 నుండి 19 అక్టోబర్ 2025 వరకు) బాసరలోని శ్రీ శృంగేరి శంకరమఠం వారిచే నిర్వహించబడిన శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా మరియు శిఖర మహా కుంభాభిషేక మహోత్సవం భక్తి, ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక వైభవంతో ఘనంగా ముగిసింది.ఆదివారం ఉదయం 8:30 గంటలకు, శ్రీశ్రీశ్రీ జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి సన్నిధానం వారు తమ అమృతహస్తములతో శ్రీ లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారి ప్రతిష్ఠా మరియు శిఖర మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టం సందర్భంగా వేదఘోషాలు, మంత్రోచ్ఛారణలు, హోమాలు, పూర్ణాహుతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో నిండిపోయింది.ఈ మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గారు మరియు ముధోల్ ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని జగద్గురువుల దివ్య ఆశీర్వచనాలను స్వీకరించారు.ఈ మూడు రోజుల మహోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని దైవదర్శనం పొందారు. ఈ సందర్భంగా శృంగేరి శంకరమఠం – బాసర ట్రస్ట్ సభ్యులు, వేదపండితులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు.ట్రస్ట్ సభ్యులు ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అన్ని వర్గాల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ శృంగేరి శంకరమఠం బాసర శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా, శిఖర మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా ముగిసింది
Published On: October 20, 2025 10:42 am











