ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు.కేటీఆర్వి పస లేని ఆరోపణలని కొట్టిపడేశారు. ఆయన గురువారం నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పార్టీని భవిష్యత్తులోనూ ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చవకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతోందని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు.
ఎవరు పాదయాత్ర చేసినా స్వాగతిస్తాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రను చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా దోచుకుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అయితే.. గత పదేళ్లలో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాలు కాదా చెప్పాలన్నారు.తెలంగాణలో టెంపుల్ కారిడార్ తెలంగాణలో రూ. 380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. టెంపుల్ కారిడార్ నిర్మాణం అయితే ఆలయాలు అభివృద్ధి చెందుతాయన్నారు.పెండింగ్లో కేంద్ర నిధులు,ఆర్వోబీల నిర్మాణం విషయంపై పీసీసీ చీఫ్ స్పందించారు. పనుల విషయంలో రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక నిజామాబాద్ జిల్లాను పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేందుకు పామాయల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లా ప్రజల 35 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటును నెరవేర్చామని చెప్పారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.









