కామారెడ్డి, జూన్ 29
ఆర్మూర్ లో జరిగిన సంఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆర్మూర్ వెళ్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టోల్ గేట్ వద్ద గంటన్నర పాటు ఉద్రిక్తత నెలకొంది.
ఆర్మూర్ లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా, ఆర్మూర్ వెళ్తున్న కామారెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మూర్ వెళ్లవద్దని సూచించగా, తాను అక్కడికి వెళ్లి తీరుతానని ఎమ్మెల్యే పోలీసులతో తెగేసి చెప్పారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఆయన కారు దిగడానికి నిరాకరించారు. దాదాపు గంటన్నర పాటు ఎమ్మెల్యే కారులోనే ఉండటంతో టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. స్థానిక బీజేపీ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడగా, ఆర్మూర్ కు వెళ్ళవద్దని ఆదేశాలు అందడంతో, తాను అక్కడికి వెళ్ళనని, కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తానని తెలిపారు. అనంతరం పోలీస్ ఎస్కార్ట్ తో ఎమ్మెల్యేను కామారెడ్డి క్యాంపు కార్యాలయం వరకు తరలించారు.









