నిజామాబాద్, జులై 3
డిచ్పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కని, తప్పుడు ఓట్లను తొలగించి పారదర్శక జాబితా రూపొందించడమే సర్ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు.
డిచ్పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల అధికారులు, డిచ్పల్లి ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, ఆర్ఐ భూపతి ప్రభు, బీఎల్ఓలు కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారత పౌరుని ప్రాథమిక హక్కు అని అన్నారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చేపట్టే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ద్వారా తప్పుడు, దొంగ, అర్హత లేని ఓట్లను తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే సర్ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఎల్ఓలు ఇప్పటికే సుమారు 90 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని, అయితే ఇప్పటివరకు కేవలం 2 శాతం ఫారాలు మాత్రమే తిరిగి అందాయని పేర్కొన్నారు. గ్రామీణ యువత స్వచ్ఛందంగా ఈ ప్రక్రియలో భాగస్వాములై, తమ గ్రామాల్లో వంద శాతం ఫారాల సేకరణకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బీజేపీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారం, మాజీ సర్పంచ్ నర్సింగరావు, కొండేటి బాలన్న, నాయుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.











